రేపు ఢిల్లీకి వెళుతున్న రేవంత్ రెడ్డి
- మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు అనుమతులపై దృష్టి సారించనున్న సీఎం
- కాంగ్రెస్ పెద్దలను కలవనున్న రేవంత్
- కేరళలో యూడీఎఫ్ విజయం నేపథ్యంలో రేవంత్ పర్యటనకు మరింత ప్రాధాన్యత
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు అవసరమైన కేంద్ర అనుమతులపై ఆయన దృష్టి సారించనున్నట్టు సమాచారం. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు అందాల్సిన నిధులపై విజ్ఞప్తులు చేయనున్నారు. పాలనాపరమైన అంశాలతో పాటు, ఏఐసీసీ అగ్రనేతలతో కూడా ముఖ్యమంత్రి సమావేశం కాబోతున్నారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సాధించిన అఖండ విజయం ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యతను చేకూర్చింది. కేరళ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించి, కూటమి విజయంలో తనవంతు కృషి చేశారు. ప్రస్తుతం కేరళ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ కొనసాగుతుండగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు రేసులో బలంగా వినిపిస్తోంది. రేవంత్ రెడ్డికి, వేణుగోపాల్తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో, ఈ ఢిల్లీ పర్యటనలో కేరళ రాజకీయ సమీకరణాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.